Friday, September 12, 2025
ePaper
spot_img
Homeక్రైమ్ వార్తలుఏసీబీకి పట్టుబడ్డ మక్తల్‌ సీఐ ఇద్దరు కానిస్టేబుల్‌

ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్‌ సీఐ ఇద్దరు కానిస్టేబుల్‌

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కేంద్రంలోని ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యా వెంకట రాములు నారాయణపేట జిల్లా మక్తల్లో శ్రీనిధి ఫైనాన్స్‌ సొసైటీని ఏర్పాటు చేశాడు. ఈయనపై పలు కేసులతోపాటు ఇటీవల కిడ్నాప్‌ కేసు నమోదు అయింది. ఈ కేసులో హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌లో భాగంగా మక్తల్‌ సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌తో కలిసి హాజరుకావాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు వెళ్లి వస్తున్న క్రమంలో మక్తల్‌ సీఐ చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. సాన్నిహిత్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సంధ్యా వెంకట రాములు.. తనకు అనుకూలంగా చార్జి సీట్లు దాఖలు చేయాలని కోరాడు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌ నరసింహ సంధ్య వెంకటరమణతో మాట్లాడి రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఐ చంద్రశేఖర్‌ ఆదేశాలతో పోలీస్‌ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌ నరసింహ, శివ నిందితుడి నుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెయిడ్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. సీఐ కోసమే లంచం తీసుకున్నామని రైటర్‌ ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో చంద్రశేఖర్‌పైనా అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. బాధితుడి నుంచి తీసుకున్న రూ.20 వేల లంచం డబ్బులను రికవరీ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News