- భక్తజన సంద్రంగా చాముండేశ్వరి ఆలయ ప్రాంగణం
- మాఘ అమావాస్య పుణ్య స్నానాలకు భారీగా తరలివచ్చిన భక్తులు
- ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీచాముండేశ్వరి అమ్మవారు
- అమ్మవారిని చూసి తరించిన భక్త జనం
- కనీవినీ ఎరుగని విధంగా ఆలయ ఏర్పాట్లు భేష్
- తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
- 60వేలకు పైగా అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం
ఉమ్మడి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని చిట్కూల్ గ్రామ శివారులో మంజీరా తీరాన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీచాముండేశ్వరి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ భక్తజన సందోహం మధ్య వైభవంగా కొనసాగింది.కనీవినీ ఎరుగని విధంగా ఆదివారం ఉదయం నుంచే వివిధ జిల్లాలు,గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.మాఘ అమావాస్య రోజున మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందనే బలమైన నమ్మకంతో భక్తులు తెల్లవారుజామునే నది తీరానికి చేరుకొని పుణ్యస్నానాలు చేశారు. అనంతరం చాముండేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ తమ మొక్కులను భక్తిశ్రద్దలతో చెల్లించుకున్నారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణమంతా చాముండేశ్వరి మాత నామస్మరణతో మార్మోగింది. అమ్మవారి సర్వదర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకుల ఆధ్వర్యంలో పోలీసు శాఖవారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 20మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుల, పోలీసుల అంచనాల ప్రకారం సుమారుగా ఆరవై వేల మంది భక్తులు చాముండేశ్వరి అమ్మవారును దర్శించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా శ్రీచాముండేశ్వరి ఆలయం భక్తి పరవశంతో ప్రత్యేక శోభను సంతరించుకుంది.
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు,చూసి తరించిన భక్తజన
మాఘ అమావాస్య కావడంతో ఆలయ అర్చకులు శ్రీచాముండేశ్వరి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దారు. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం 18చేతులతో,9అడుగుల ఎత్తులో,అమ్మవారి ముందర సింహంతో శక్తిస్వరూపిణిగా కనిపిస్తారు.అయితే ఆలయ అర్చకులు అమ్మవారిని ఉదయమే ప్రత్యేక అలంకరణతో అలంకరించారు.ఆ జగన్మాతను చూడడానికి భక్తి సంఖ్యలో వచ్చిన భక్తజనం అమ్మవారి అపురూప అలంకరణను చూసి తరించారు.ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగింది.

ఆలయ ఏర్పాట్లు,భద్రత పనితీరు భేష్
తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయడని,అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి భద్రతను కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండల ఎస్ఐ నర్సింలు ఆధ్వర్యంలో పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడడంతో ఆలయ నిర్వాహకుల పోలీసుల పనితీరు భేష్ అని డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు.ఆయనతో పాటు నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
