శుభప్రదమైన ప్రయాణానికి జాగ్రత్తలే ఉత్తమ నివారణ మార్గాలని మల్కాజ్గిరి డిసిపి శ్రీధర్ తెలిపారు. తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన లైవ్ క్యాంపెయిన్ 2026లో భాగంగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ చౌరస్తాలో ఎరైవ్ ఎ లైవ్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితుల అనుభవాల ఆధారంగా మెగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన డిసిపి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రోడ్డు మార్గాల్లో ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమేనని స్పష్టం చేశారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బందిని పెంచినట్లు తెలిపారు. ప్రజలు రోడ్డుపై ప్రయాణించే సమయంలో వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు భద్రత అంశంపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం ప్రమాదాలు నిర్లక్ష్యపు డ్రైవింగ్ మితిమీరిన వేగం అజాగ్రత్త వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న నానుడి ప్రకారం నివారణే ప్రమాదాల తగ్గుదలకు ఉత్తమ మార్గమని వివరించారు.
అనంతరం జవహర్ నగర్ పోలీస్ సిబ్బంది సురక్షిత డ్రైవింగ్ చిట్కాలు ప్రమాదం జరిగిన తర్వాత అత్యవసర ప్రతిస్పందన విధానాలు ప్రమాదాల అనంతరం తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యక్ష అవగాహన ఖర్ఫీదులో ట్రైనింగ్ రూపంలో చేసి చూపించారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఎస్ హెచ్ఓ సైదయ్య అడ్మిన్ ఎస్ఐ రాము జవహర్ నగర్ ట్రాఫిక్ సిఐ శివశంకర్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు పాల్గొన్నారు.
