- లాలాపేట్ జనప్రియ అపార్ట్మెంట్స్లో సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించిన లాలాగూడ పోలీసులు
లాలాపేట్ ప్రాంతంలోని జనప్రియ అపార్ట్మెంట్స్లో లాలాగూడ పోలీస్ స్టేషన్ డి.ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు యుగంధర్,అమర్ సింగ్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు,ప్రధానముగా యువత,సైబర్ నేరాలపై అప్రమత్తముగా ఉండాలని పోలీసులు వివరించారు.ఆన్లైన్ మోసాలు,ఫేక్ కాల్స్,లింకుల ద్వారా డబ్బు దోపిడీ,ఓటీపీ షేరింగ్ ప్రమాదాలు,సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
అనుమానాస్పద కాల్స్కు స్పందించకూడదని,వ్యక్తిగత సమాచారం,బ్యాంక్ వివరాలు,ఓటీపీలు ఎవరితోనూ పంచుకోరాదని పోలీసులు సూచించారు.ఏవైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు. అందులో భాగంగా యువత మహిళలు,వృద్ధులు సైబర్ నేరాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని,సోషల్ మీడియా వేదికల్లో అపరిచితుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు,ఫ్రెండ్ రిక్వెస్ట్లను పరిశీలించి మాత్రమే స్వీకరించాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమం వల్ల సైబర్ నేరాలపై స్పష్టత ఏర్పడిందని,భద్రతా చర్యలపై మంచి సమాచారం అందిందని అపార్ట్మెంట్ నివాసితులు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
