- బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు..!
- గ్రామ సింహాల దాడులు కుకునూరు పల్లి తిప్పారం ప్రజల్లో ఆందోళన..!
- మృతి చెందిన కోళ్ల వాసనకు గుంపులుగా చేరిన కుక్కలు ప్రజల్లో భయం..!
- అధికారుల నిర్లక్ష్యం కెనాల్ పక్కన ‘కుక్కల రాజ్యం..!
- కుకునూరు పల్లి–తిప్పారం రోడ్డుపై భయం పుట్టిస్తున్న కుక్కలు..!
- మల్లన్న సాగర్ కాలువ పక్కన వాహనదారుల ఆందోళన..!
కుకునూరు పల్లి మండల కేంద్రం నుంచి తిప్పారం గ్రామానికి వెళ్లే మార్గం ఇటీవల భయానకంగా మారింది. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే ప్రధాన కాలువ పక్కన పదుల సంఖ్యలో గ్రామ సింహాలు (కుక్కలు) గుంపులుగా తిరుగుతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి రోజు సాయంత్రం తర్వాత ఈ రోడ్డుపై ప్రయాణం ఓ సాహసం అవుతోంది. ఒంటరిగా బైక్పై వెళ్లే వాహనదారులు ఈ కుక్కల గుంపుల దాడులకు గురవుతున్నారు.

అక్కడి కోళ్ల ఫార్మ్ యజమానులు చనిపోయిన కోళ్లను కాలువ పక్కన పడేస్తుండటంతో ఈ గ్రామ సింహాలు ఆ ప్రాంతాన్నే స్థావరంగా మార్చుకున్నాయి. పగలు కాలువ పక్కనే విశ్రాంతి తీసుకుని, రాత్రివేళ వాహనాల వెనక పరిగెత్తడం, దాడులు చేయడం మొదలుపెట్టాయి. “ఇది ఇలానే కొనసాగితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది” అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోని వెటర్నరీ, గ్రామపంచాయతీ, పశుసంవర్ధక శాఖలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాహనదారులు, గ్రామస్థులు కుక్కల నియంత్రణ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, కాలువ పక్కన మృతి చెందిన కోళ్లను పడేయడాన్ని ఆపాలని అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే, వాహనదారులు చిన్నపిల్లలు, పాదచారులు పొలాల వద్దకు వెళ్లే రైతులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
