సంగారెడ్డి జిల్లా (Sangareddy District) కొల్లూరులోని 2BHK కాలనీలో నెలకొన్న సమస్యల (Problems)ను 24 గంటల్లోనే పరిష్కరించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చెప్పారు. ఈ కాలనీలో సుమారు 16 వేల కుటుంబాలు, 48 వేలకు పైగా ప్రజలు నివసిస్తుండగా.. వారి కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపారు. వారం రోజుల కిందట ఇచ్చిన మాట ప్రకారం కాలనీవాసుల సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించామని పేర్కొన్నారు. ముఖ్యంగా సన్నబియ్యం తీసుకునే లబ్ధిదారులకు రేషన్ షాపు(Ration Shop), కాలనీలోపలకి ఆర్టీసీ బస్సులు (Rtc Busses) వచ్చేలా ఏర్పాటుచేశామని వెల్లడించారు.
‘కాలనీవాసుల రక్షణ కోసం శాశ్వత పోలీస్ స్టేషన్ (Police Station) నిర్మాణం చేపట్టాం. అంతే కాదు. 24 గంటల్లోనే తాత్కాలిక ఔట్ లెట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేశాం. గతంలోనే ఆస్పత్రి (Hospital) నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. అత్యవసరం కోసం 2 అంబులెన్స్(Ambulance)లను అందించాం. కబరస్థలం ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నాం. కాలనీలో అర్హులైన పేదలందరికీ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కాలనీలో షాపుల ఏర్పాట్లకు త్వరలో టెండర్లు వేస్తాం.
ఇవన్నీ సంపూర్ణంగా జరగాలంటే ముందు కాలనీవాసులు కమిటీని వేసుకోవాలి. ఇది పేదల పక్షపాతి పార్టీ. వీలైనంత తొందరలో కొల్లూరు కాలనీవాసుల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇస్తున్నా. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కొల్లూరు కాలనీవాసుల దీవెనలు ప్రజా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నా’ అని పొంగులేటి అన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారం, ఇతర సౌకర్యాల కల్పనపై మంత్రి అజారుద్దీన్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, కౌన్సిలర్ భరత్తో కలిసి చర్చించినట్లు తెలిపారు.
