నిజామాబాద్ నుంచి శ్రీకారం!
హైదరాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) రాజకీయ పార్టీ (Political Party) ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న కవిత శనివారం (అక్టోబర్ 25) నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. పార్టీ పెడితే ప్రజలకు మేలు జరగాలని కవిత ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) సామాజిక సంస్థ అయినా.. అవసరమైతే రాజకీయాల (Politics) గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడాలంటే తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరంలేదని తెలిపారు. ఒక వేళ తన నుంచి పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తానన్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఆంధ్ర(Andhra)లో మూడు, తమిళనాడు(TamilNadu)లో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, కేరళ(Kerala)లో అయితే గల్లీకి ఒక పార్టీ ఉందని గుర్తుచేశారు.
ఈ నెల 25న నిజామాబాద్ (Nizamabad) నుంచి ప్రారంభమయ్యే ‘జనం బాట’ కార్యక్రమం 33 జిల్లాల్లో 4 నెలలు పాటు జరుగుతుందని కవిత తెలిపారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటానని, అక్కడి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు.. అన్ని వర్గాలను కలుస్తానని వెల్లడించారు.
