రెండు వేల సామర్ధ్యం ఉన్న ఆలయానికి 25 వేల మంది రాక..
తోపులాటతో ఊడిన రెయిలింగ్స్.. ఒకరిపై ఒకరు పడిన భక్తులు..
- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోరం
- స్థానిక వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట
- ఏకాదశితో భారీగా తరలివచ్చిన భక్తులు
- 9మంది మృతి.. పలువురికి గాయాలు
- పెద్ద సంఖ్యలో గాయపడిన భక్తులు
- మృతుల్లో మహిళలు, పిల్లలే అధికం
- క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించి చికిత్స
- ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. ఈ సమయంలో అకస్మాత్తుగా జనసందోహం పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు సంఘటన జరిగిన ఆలయానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ తొక్కిసలాట ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరా తీశారు. అయితే, తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా పండా కుటుంబం పదేళ్ల క్రితం 12 ఎకరాల భూమిలో ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. కార్తీకమాసంలో వచ్చే ఏకదశి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రెయిలింగ్ ఊడిపోయివడంతో కిందపడ్డారు. దీంతో పిల్లలతో సహా తొమ్మిది మంది చనిపోయారు. ఆలయం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. సుమారు 25 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను వై. చిన్నమ్మ, ఆర్. విజయ, ఎం. నేలమ్మ, డి. రాజేశ్వరి, సీహెచ్ పశోధామిగా గుర్తించారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించా లని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించా ల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను’ అని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించిన ఆయన.. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన తనను బాగా కలచివేసింది.. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. ఈ తొక్కిసలాటలో గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అలాగే, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు ఆదేశం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలగా అండగా ఉంటుందని హోం మంత్రి అనిత హామీ ఇచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాననని అన్నారు. ఆలయ తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు.
కాగా, కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం ఓ ప్రైవేట్ ఆలయం. ఇది ఏపీ దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయం వద్ద ఈ స్థాయిలో భక్తులకు దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అలాగే ఈ కార్యక్రమం గురించి ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించలేదు. అయితే సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది భక్తులు వస్తుంటారని.. ఇంత పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామని ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా తెలిపారు.
