- రాజాపేట మండలం, చల్లూరు సర్వే నం.322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ క్రషర్
- అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్పై యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు..
- నెలరోజులు గడిచిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబేంటి..?
- యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపడంలో జాప్యం చేస్తున్న సంబంధిత అధికారులు..
- అక్రమార్కులకు, అధికారులకు ఏదైనా ఒప్పొందం కుదిరిందా..?
- నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు
యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం, చల్లూరు గ్రామంలోని సర్వే నెం. 322/4లో శ్రీని డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్ నిర్వహణ, నకిలీ పత్రాల వినియోగం, పర్యావరణ నష్టంపై పుంఖాను పుంఖాలుగా ‘ఆదాబ్ హైదరాబాద్’ ఆధారాలతో సహా కథనాలు ప్రచురించిన సంగతి విదితమే..
కాగా ఈ అక్రమ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావు యాదాద్రి కలెక్టర్ హనుమంత రావు ఐఏఎస్ కి 12 జనవరి 2026 నాడు ఫిర్యాదు చేయడం జరిగింది.. ఈ ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ వెంటనే ఈ అక్రమ క్రషర్, అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్ వ్యవహారంపై విచారణ జరిపి యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపించాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు..

విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేయడం జరిగింది.. అనుమతులు లేని క్రషర్: సర్వే నెం. 322/4లో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ స్థాయి స్టోన్ క్రషర్ ను నిర్వహించడం. నకిలీ పత్రాలు, అక్రమ అనుమతులతో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అదే విధంగా నిరంతర పేలుళ్లు, కాలుష్యం వల్ల స్థానిక ప్రజల ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, అటవీ భూమికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
కనుక ఈ వ్యవహారం కేవలం ప్రైవేటు సమస్య మాత్రమే కాదని, ఇది ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల జీవనానికి సంబంధించిన తీవ్రమైన అంశమని కలెక్టర్ పేర్కొన్నారు. కనుక దీనిపై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంటనే ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారుడు డిమాండ్ చేస్తున్నారు.. అంతేకాకుండా చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

సంబంధిత అధికారులు తాము తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని కోరారు.. కాగా యాదాద్రి కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల కాపీని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, యాదాద్రి భువనగిరి. తహశీల్దార్, రాజపేట మండలం. వారికి కూడా పంపించడం జరిగింది.. కానీ నేటి వరకూ ఎలాంటి చర్యలు జరుగలేదు..
దీనికి కారణం స్థానిక సంబంధిత అధికారులు అక్రమ క్రషర్ యాజమాన్యంతో కుమ్మక్కైయ్యారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. అందుకే సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ఆదేశించినా అటువైపు కన్నెత్తి చూడటం లేదా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. ఇంత బహిరంగంగా, నిర్భయంగా అక్రమ క్రషింగ్ చేస్తూ చుట్టుపక్కల ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ..
వారి ఆరోగ్యాలను నాశనం చేస్తూ.. ముందుకు సాగుతున్నారు అంటే క్రషర్ యాజమాన్యం ఏ మేరకు అధికారులను మేనేజ్ చేస్తోందో..? ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.. వీరు చేస్తున్న దుర్మార్గపు పనివల్ల వాతావరణం కాలుష్యం కావడమే కాకుండా, భూగర్భం కూడా నాశనం అవుతోంది.. ఆ పరిసరాల పచ్చదనం కనుమరుగైపోతోంది..

అంతే కాకుండా ప్రాంతంలోని రహదారులు చెడిపోయి, ప్రయాణం చేయడానికి వీలులేకుండా పోతోంది.. ఇక ప్రభుత్వానికి న్యాయంగా దక్కాల్సిన ఆదాయం కూడా గాల్లో కలిసిపోతోంది..? ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా యాదాద్రి కలెక్టర్ ఈ అమానుష అక్రమ వ్యవహారంపై దృష్టి సారించి..
తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమాలకూ కారణభూతులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రమార్కులకు సహకరిస్తున్న అవినీతి అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు గైకొని.. 3 ప్రాంతాన్ని, ఆప్రాంత ప్రజలను రక్షించి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. ఈ వ్యవహారంలో జిల్లా పోలీసు అధికారులు, రాజాపేట మండలం తహశీల్దారు కూడా సత్వరమే స్పందించి కలెక్టర్ ఆదేశాలను వెంటనే పాటించి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సిద్ధం చేసి పంపించే ఏర్పాటు చేయాలని కూడా స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు..
