- అధికారుల తీరు పట్ల స్థానికుల ఆగ్రహం
- అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు
- తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
Greater Hyderabad Municipal Corporation పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమిస్తూ అనుమతులు లేకుండా భవన నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుక్కమ బస్తి నల్ల పోచమ్మ దేవాలయం వద్ద ప్రధాన రహదారిని ఇరువైపులా ఆక్రమిస్తూ నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు.

గతంలో గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం నిర్మించుకున్న పాత నివాసాన్ని, ప్రస్తుతం మున్సిపల్ పరిధిలోకి వచ్చిన తర్వాత మరింత విస్తరించి రోడ్డు స్థలాన్ని కలుపుకుంటూ నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశమైంది. ప్రజా రాకపోకలకు ఇబ్బంది కలిగేలా పనులు సాగుతున్నా తనిఖీలు, నోటీసులు కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇలాంటి నిర్మాణం ఎలా కొనసాగుతుందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా, రహదారి భూమిని వినియోగిస్తూ పనులు జరుగుతుండటం మున్సిపల్ చట్టాల ఉల్లంఘనేనని వారు అంటున్నారు. కొందరు ముడుపుల ఆరోపణలు కూడా చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని రహదారి ఆక్రమణ తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు.
