- కోటి ఏభై లక్షలు కొట్టేసిన ఆగంతకులు..
- రూ. 2.36 లక్షలు సమర్పించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి..
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయం, ప్రేమ లాంటివి ఎక్కువ శాతం మోసాలకు దారితీస్తున్నాయి. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళా కిలేడీ మాటలు నమ్మి హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా 2.36 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. చివరికి మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్ వీరభద్రరావుకు గత ఏడాది ఆగస్టులో ‘కోరా’ అనే పేరుతో ఒక మహిళ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను సింగపూర్ పౌరురాలినని, ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నానని అతడ్ని నమ్మించింది. బాధితుడితో సన్నిహితంగా మెలిగేలా చాటింగ్ చేస్తూ అతడికి తనపై నమ్మకం కలిగేలా చేసింది. ఆ తర్వాత తన స్నేహితులంతా ఫేస్బుక్ స్టోర్ ద్వారా భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని, అతడిని కూడా ఇన్వెస్ట్ చేయాలని పెట్టాలని ప్రేరేపించింది.
ఆపై ప్లాన్ ప్రకారం అటువైపు నుంచి ఒక ఏపీకే (APK) ఫైల్ను పంపి, బాధితుడి ఫోన్లో ఒక నకిలీ యాప్ను ఇన్స్టాల్ చేయించింది. సలహాల కోసం బెల్లా అనే జర్మనీ స్నేహితురాలి నంబర్ను ఇచ్చి, ఆమె చెప్పినట్లు ట్రేడింగ్ చేయాలని సాఫ్ట్వేర్ ఉద్యోగికి సూచించింది. వారి మాయమాటలు నమ్మిన వీరభద్రరావు, గతేడాది సెప్టెంబరు 1 నుండి డిసెంబరు 12 మధ్య పలు విడతలుగా క్రిప్టో వ్యాలెట్ ద్వారా ఏకంగా రూ.2.36 కోట్ల వరకు నగదు బదిలీ చేశాడు. యాప్లో లాభాలు వస్తున్నట్లు కనిపిస్తున్నా, వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం మాత్రం లభించలేదు.
డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు, తాను మోసపోయానని గ్రహించి శనివారం సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మూడున్నర నెలల వ్యవధిలోనే ఇంత భారీ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు. తెలియని వ్యక్తులు పంపే లింకులు, ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో పరిచయమయ్యే వారిని గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు, రాత్రికి రాత్రే సంపాదనం రెట్టింపు అవ్వడం లాంటివి ఉండవని ప్రజలకు సూచించారు.
