Tuesday, October 28, 2025
ePaper
Homeమహబూబ్‌నగర్‌Mahabubnagar | జిల్లాకు చారిత్రక అన్యాయం

Mahabubnagar | జిల్లాకు చారిత్రక అన్యాయం

జిల్లా ప్రజలు సీఎంని, కాంగ్రెస్ పార్టీని క్షమించరు
‘జనం బాట’లో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
కరివెన రిజర్వాయర్‌ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Ranga Reddy Lift Irrigation Scheme)లో భాగమైన కరివెన రిజర్వాయర్‌(Karivena Reservoir)ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని క్షమించరని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను సుప్రీంకోర్టు (Supreme Court) సస్పెన్షన్‌లో పెట్టినా రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ల్యూసీ (CWC) ప్రాజెక్టుల పర్మిషన్ ఆపేసి లిస్ట్ లోంచి తీసేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవ్వాళ మహబూబ్ నగర్ వచ్చాం. మహబూబ్ నగర్ జిల్లాకు నీరిచ్చే వరప్రదాయని కృష్ణా నది. అలాంటి కృష్ణానదిలో తెలంగాణ సిద్దించిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవటం జరిగింది. కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తైనయ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా సరే ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

ఉద్దండపూర్, కరివెన లో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. నార్లపూర్ నుంచి ఎదెల వరకు వచ్చే టన్నెల్ పనులను చేయటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లను సుప్రీంకోర్టు సస్పెన్షన్ లో పెట్టింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు. ఇది దారుణం. ఇంకా దారుణంగా సీడ్య్లూసీ ఈ ప్రాజెక్ట్ ల పర్మిషన్లను ఆపేసి ప్రాజెక్ట్ లను లిస్ట్ లోంచి తీసేసింది. అయిన సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రే స్వంత జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు.

ఒక పక్క ఉన్న నీళ్లను వాడుకోవటం లేదు. మరో పక్క ఆల్మట్టి ఎత్తు పెంచితే మాట్లాడటం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉంటది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉంటది. అయిన చూస్తూ ఊరుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారు. జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తక్షణమే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా.

RELATED ARTICLES
- Advertisment -

Latest News