- రేవంత్వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు
- జూబ్లీహిల్స్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే
- ఓటర్లను బెదిరించే ధోరణిలో ప్రసంగాలు
- రేషన్ కార్డులు ఇవ్వమనడం దారుణం
- మండిపడ్డ మాజీమంత్రి హరీష్ రావు
సొంత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డికి పట్టు లేదు. రోజుకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఢిల్లీకి ఉత్తరాలు రాస్తున్నాడు. రేవంత్ రెడ్డి హయాంలో క్రైం రేటు పెరిగింది. కమీషన్ల కోసం కమాండ్ కంట్రోలు సెంటర్లో రేవంత్ రెడ్డి సమీక్షలు చేస్తున్నాడు. బీజేపీ 8ఎంపీలు గెలిచినా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా. బీజేపీ ఇవ్వదు.. రేవంత్ రెడ్డి కొట్లాడడు’
-హరీశ్ రావు
బ్లాక్ మెయిల్ చేసి జూబ్లీహిల్స్లో ఓట్లు వేయించుకోవాలని సీఎం రేవంత్ చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేయకుంటే.. రేషన్ కార్డులు ఆగిపోతాయంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అయ్య జాగీరా? రేవంత్ ఇంట్లో నుంచి ఇస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అంటూ కామెంట్స్ చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే.. జూబ్లీహిల్స్లో రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిలర్ కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
కంటోన్మెంట్లో ఆరు వేల డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి కంటోన్మెంట్లో గెలిచారన్నారు. రెండేళ్ళుగా అజహారుద్దీన్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి.. ఎన్టీఆర్, పీజేఆర్ విగ్రహాల హామీలు అంటూ వ్యాఖ్యలు చేశారు. సీనీ యాక్టర్స్ను జైల్లో పెట్టిన రేవంత్.. సినీ కార్మికులకు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
2023 లో పీజేఆర్ కొడుకుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని అడిగారు. కాంగ్రెస్ అరాచకం, మంత్రి పదవి ఇవ్వకపోవటంతోనే పీజేఆర్ చనిపోయారంటూ సంచలన కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో రాష్ట్ర భవిష్యత్కు దశ దిశ ఏర్పడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలు కాదు.. నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. గ్యారంటీలు ఎగ్గొట్టిన అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే.. మూడేళ్ళ పాటు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. వికాసానికి.. విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. రేవంత్ అంటేనే బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి పారిశ్రామికవేత్తలను బెదిరించిన చరిత్ర రేవంత్ ది అని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతోన్న కళాశాలను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను కేసీఆర్ కొనసాగించారని గుర్తుచేశారు. హైడ్రా విషయంలో డిప్యూటీ సీఎం భట్టి, సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మర్రి జనార్ధన్ రెడ్డి, రవీందర్ రావు ఇంటిపై దాడులను మాజీ మంత్రి ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తోందన్నారు. కాంగ్రెస్ అరాచకాలపై 20 ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హోంమంత్రిగా, విద్యామంత్రిగా, మున్సిపల్ మంత్రిగా.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రిపై రోజుకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తరాలు రాస్తున్నారని.. సొంత ప్రభుత్వంపై ముఖ్యమంత్రికి పట్టు లేదంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ హయాంలో క్రైం రేటు పెరిగిందన్నారు. కమీషన్ల కోసం కమాండ్ కంట్రోలు సెంటర్లో సీఎం సమీక్షలు చేస్తున్నారని మాజీమంత్రి ఆరోపించారు.
బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదన్ తమ్ముడు వెంకట్ యాదవ్కు మూడు ఓట్లు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని ఆరోపించారు. ప్రధాని చెప్పిన ఆర్ఆర్ టాక్స్పై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు అని నిలదీశారు. కాంగ్రెస్ లేకుంటే.. ముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ అన్యాయమన్నారు. ముస్లింలను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
