- ప్రభుత్వ భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు
- కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ హెచ్చరిక
సర్కారు స్థలాలు కబ్జాచేయాలని ప్రయత్నిస్తే కటకటాలపాలవుతారని కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ హెచ్చరించారు. అమాయక పేదలకు ప్రభుత్వ భూములు ప్లాట్లుగా చేసి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులపై ప్రత్యేక నజర్ పెట్టినట్లు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ లో సర్వే నెం.. 695.696.లో సుమారు 29 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నట్లు సమాచారం అందడంతో, గురువారం కాప్రా తహసీల్దార్ రాజేశ్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూమిని కాపాడారు.

ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా రెవెన్యూ శాఖ ముందుకు సాగుతోందని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడుతూ కంచె ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
