లంచం ఇస్తే చట్టం చుట్టమైపోతుంది, ధనవంతుడికి నియమాలు వర్తించవు అనడానికి బంజారా హిల్స్లోని ఈ అక్రమ కట్టడమే నిలువెత్తు నిదర్శనం. ‘ముడుపులు ఇచ్చుకో మూడంతస్తులు కట్టుకో’ శీర్షికతో సెప్టెంబర్ 14, 2025న ‘ఆదాబ్ హైదరాబాద్’లో ప్రచురితమైన కథనానికి జీహెచ్ఎంసీ సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు.
నవంబర్ 15, 2025న బంజారా హిల్స్ రోడ్ నెం. 12లోని ఇంటి నెంబర్ 8-2-684/C/2 వద్ద ఉన్న అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసి, జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే, ఈ సీజ్ డ్రామాకు వారం రోజుల్లోనే తెరపడింది.
భవన యజమాని నుండి భారీగా ముడుపులు అందుకున్న అధికారులు, తమ కళ్లెదుటే ఆ ఫ్లెక్సీని తొలగించి, అక్రమ నిర్మాణ పనులను శరవేగంగా కొనసాగించడానికి పచ్చజెండా ఊపారు. సీజ్ చేసిన భవనంలోనే మళ్ళీ పనులు జరుగుతున్నా..
తమకు ఏమీ తెలియనట్టు, చూడనట్టు ఆస్కార్ అవార్డు గ్రహీతలను మించిపోయేలా నటిస్తున్నారంటే వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది అధికారులకు తెలియకుండా జరుగుతోందా? లేక అంతా తెలిసే కళ్లు మూసుకుని అవినీతి కరెన్సీ కట్టల వెలుగులో నగరాన్ని నాశనం చేస్తున్నారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిదే.
ఒక అక్రమ నిర్మాణం ఇంత బహిరంగంగా, ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి కొనసాగుతుంటే, దానిని అరికట్టాల్సిన ఉన్నతస్థాయి యంత్రాంగం ఏం చేస్తోంది? కేంద్ర కార్యాలయంలో ఓ కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగానికి చీఫ్ సిటీ ప్లానర్, అడిషనల్ సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఉంటారు. జోనల్ కార్యాలయానికి వస్తే జోనల్ కమిషనర్, సిటీ ప్లానర్, ఏసీపీ ఉంటారు. ఇక సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సెక్షన్ ఆఫీసర్, చైన్ మెన్లు… ఇలా పేర్చుకుంటూ పోతే అధికారుల జాబితా చాంతాడులా ఉంటుంది.
కానీ, ఇంతమంది అధికారులు, సిబ్బంది ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం ఒక అక్రమ నిర్మాణాన్ని కట్టడి చేయలేకపోవడం వారి అసమర్థతకు, అవినీతికి నిలువుటద్దం పడుతోంది. పాలకుల అండదండలతో, అధికారుల జేబులు నింపుతూ అక్రమార్కులు రెచ్చిపోతుంటే, ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పౌరులు ఎవరైనా ధైర్యం చేసి కమిషనర్కు ఫిర్యాదు చేస్తే, దాన్ని కేవలం కిందిస్థాయి అధికారులకు ఫార్వర్డ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, దాని పురోగతి ఏమిటో ఫిర్యాదుదారునికి తెలియజేసే నాథుడే లేడు.
ఇదే అదునుగా భావించిన క్షేత్రస్థాయి అధికారులు, ఆ ఫిర్యాదులను అక్రమ నిర్మాణదారులతో బేరసారాలకు “బేరర్ చెక్కు” రూపంలో వాడుకుంటున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే యజమానిని బెదిరించి, భారీ మొత్తంలో లంచం తీసుకుని ఫైల్ను మూసివేస్తున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన వాళ్లే వెర్రివాళ్లయ్యే పరిస్థితి నెలకొంది.
ఇంతటి అద్వానమైన, అవినీతిమయమైన వ్యవస్థను నడపడానికి ఒక ఐఏఎస్ అధికారి అవసరమా అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఒకప్పుడు ఐఏఎస్ అధికారులు అంటే సమాజంలో ఎంతో గౌరవం, భయం ఉండేది. కానీ నేడు కొందరు అధికారులు రాజకీయ నాయకులకు జీ హుజూర్ అంటూ, చట్టాలను ఉల్లంఘిస్తూ, అవినీతికి పాల్పడుతూ ఆ పదవికే కళంకం తెస్తుబంజారా హిల్స్లో నిబంధనలకు విరుద్ధంగా, సీజ్ చేసిన తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ అక్రమ నిర్మాణం జీహెచ్ఎంసీ వ్యవస్థ వైఫల్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. న్నారు. వారి నిర్లక్ష్య వైఖరి చూసి యావత్ సమాజం ఛీ కొడుతోంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఈ అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం మోపడంతో పాటు, దీనికి సహకరించిన అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, హైదరాబాద్ నగరం అక్రమ నిర్మాణాల కాంక్రీట్ జంగిల్గా మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఇంత దుర్మార్గమైన జీహెచ్ఎంసీ శాఖను, ఈ నగరాన్ని రక్షించేదెవరో కాలమే సమాధానం చెప్పాలి.


