ఇటీవల తెలంగాణలోని వరంగల్ నిట్ క్యాపస్లో జెన్ జెడ్ పోస్టాఫీసు ప్రారంభం కాగా ఇప్పుడు ఏపీలోనూ మూడు జెన్ జెడ్ పోస్టాఫీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడింటిలో ఒకటి.. విట్ యూనివర్సిటీ(VIT University)లో ఉండటం గమనార్హం. అక్కడ ఇప్పటికే ఉన్న సబ్ పోస్ట్ ఆఫీస్ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్గా మార్చారు. గుంటూర్ పోస్టల్ డివిజన్(Guntur Postal Division)లోని విట్ సబ్ పోస్టాఫీస్ను ఆధునికీకరించి జెన్ జెడ్ పోస్టాఫీస్గా తీర్చిదిద్దారు. ఈ పోస్టాఫీస్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి(Union Minister of State for Rural Development and Communications) డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్(Dr.Pemmasani Chandrasekhar) శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయ పోస్టల్ ఆఫీసులను యువత కేంద్రంగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సేవా కేంద్రాలుగా (Youth Centric Services) మార్చాలనే లక్ష్యంతో జెన్ జెడ్ పోస్టాఫీస్లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 జెన్ జెడ్ పోస్టాఫీసులను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. పోస్టల్ శాఖలో పెట్టే ఖర్చుల్లో 89 శాతం వేతనాలకే సరిపోతున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి, విట్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.అరుల్ మాజీవర్మన్, విట్ రిజిస్ట్రార్ ఎం.జగదీష్ చంద్ర, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ వి.ఉపేందర్, పోస్టల్ సూపరింటెండెంట్ మధుర వాణి, పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
