Wednesday, February 11, 2026
Homeనల్లగొండShadow DMHO | అంతా నా ఇష్టం

Shadow DMHO | అంతా నా ఇష్టం

నల్గొండ (Nalgonda) వైద్యారోగ్య శాఖలో షాడో డి.ఎం.హెచ్.ఓ

గుట్టుచప్పుడు కాకుండా స్టాఫ్ నర్సు (Staff Nurse) పోస్టుల భర్తీ పక్రియ?

- Advertisement -

పత్రికా ప్రకటనలో ఎం.ఎస్సి. అర్హత.. ఎక్స్పీరియన్స్ పేరుతో ‘నాట్ ఎలిజిబుల్’ అంటూ 19 మంది ఔట్?

​తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు (Jobs) కట్టబెట్టుతున్నారా?

పత్రికా ప్రకటన ఇచ్చి పది నెలలు.. ఇప్పుడు భర్తీ పక్రియ!

నల్గొండ ప్రతినిధి, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ వార్డు (పల్లెటివ్ కేర్ యూనిట్)లో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 4 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం (డి.ఎం.హెచ్.ఓ) పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను పక్కనపెట్టి, నియామక ప్రక్రియను పది నెలలపాటు సాగదీసి, గుట్టుచప్పుడు కాకుండా తమకు అనుకూలమైన అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

​ప్రకటన ఒకటి… అమలు ఇంకొకటి?

​జనవరి 2, 2025న(డి.ఎం.హెచ్.ఓ) కార్యాలయం నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఎం.ఎస్సి అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. అనుభవం (ఎక్స్‌పీరియన్స్), రోస్టర్, మెరిట్, లోకల్, నాన్-లోకల్ వంటి ఎలాంటి అదనపు నిబంధనలూ ఆ ప్రకటన లో లేవు. దీంతో (ఎం.ఎస్సి) అర్హత కలిగిన 27 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 200 చెల్లించి జిల్లా వైద్య ఆరోగ్య
శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

​పది నెలల జాప్యం… నిబంధనలు మార్చినరా?

​నిబంధనల ప్రకారం వేగంగా జరగాల్సిన ఈ నియామక ప్రక్రియ…పది నెలల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఈ మధ్య కాలంలో అధికారులు, కొంత మంది ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్న వారి మధ్య ‘బేరసారాలు’ జరిగాయని, ఉద్యోగాలకు భారీగా వసూలు చేశారనే స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న 27 మందిలో ఏకంగా 19 మందిని ‘నాట్ ఎలిజిబుల్ కాండిడేట్స్’ గా ప్రకటించారు. పత్రికా ప్రకటనలో లేని ఎక్స్‌పీరియన్స్, రోస్టర్, మెరిట్, లోకల్/నాన్-లోకల్ వంటి కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చి ఈ 19 మందిని అనర్హులుగా తేల్చినట్లు,సమాచారం.

కేవలం M.Sc. అర్హత మాత్రమే ప్రామాణికంగా ఉన్నప్పుడు, ఇతర నిబంధనలు ఎందుకు, ఎవరి ప్రయోజనం కోసం తీసుకువచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్న వారిని ‘ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి’ ఫోన్లో సంప్రదించగా మాకు గత పది నెలలుగా ఏ ఫోన్ కాల్ రాలేదని, ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, మేము అడిగినప్పుడల్లా రేపు మాపు అంటూ అధికారులు కాలం గడిపారని తెలిపారు..

​గుట్టుచప్పుడు కాకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్!

బేరసారాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల బృందం…గత నెలలో సోమవారం (అక్టోబర్ 27) మిగిలిన 8మంది అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) పేరుతో కార్యాలయానికి పిలిపించి, తూతూ మంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించి పంపించినట్లు సమాచారం.

​నోటీస్ బోర్డులో మెరిట్ లిస్ట్ లేదు. మీడియాకు అనుమతి ఇవ్వలేదు. ​నియామక ప్రక్రియను పూర్తిగా రహస్యంగా నిర్వహించారు.

​ఉద్యోగ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరగాలనే నియమం ఉన్నప్పటికీ, నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అధికారులు మాత్రం ఈ మొత్తం ప్రక్రియను గుట్టుగా కానిచ్చారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. కేవలం తమకు అనుకూలమైన, ‘ఇష్టమైన వారిని’ ఎంపిక చేసేందుకే ఈ జాప్యం, చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, పారదర్శక నియామకం జరిగేలా చూడాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News