ఆర్థిక సర్వే నివేదిక 2026ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి(Union Finance Minister) నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్ (Parliament)లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ఈ రిపోర్ట్ వెల్లడించనుంది. ప్రపంచ అనిశ్చితులు, అమెరికా సుంకాల నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యత నెలకొంది. ఈ ఆర్థిక సర్వే ప్రస్తుత(FY26), రాబోయే ఆర్థిక సంవత్సరం(FY27)లో మన దేశ GDP వృద్ధి అంచనాలను వెల్లడిస్తుంది. బడ్జెట్ ముందు వెలుడిన ఈ కీలక పత్రం.. ఇండియా వార్షిక ఆర్థిక అభివృద్ధిని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్వల్ప, మధ్యకాలిక అవకాశాలను వివరిస్తుంది.
ఆర్థిక సర్వే 2026లో పేర్కొన్న విధాన సంస్కరణల కీలక ఫలితాలను ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తర్వాత వివరిస్తారు. సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్న తొలి మహిళగా నిలిచి దేశ పార్లమెంటరీ చరిత్రలో చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటులో 2026 బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇది గర్వకారణమైన క్షణంగా నమోదైందని అన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రధాని మోదీ ప్రభుత్వ 15వ బడ్జెట్ను ప్రవేశపెడతారు.
2024లో వరుసగా మూడోసారి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో పూర్తి బడ్జెట్ అవుతుంది. గత దశాబ్ద కాలంలో ఇండియా ప్రతి ప్రధాన రంగంలో పురోగతి సాధించింది. భవిష్యత్ వృద్ధికి బలమైన పునాది వేసింది. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను 2 దశల్లో 65 రోజులు నిర్వహించనున్నారు. మొత్తం 30 సార్లు భేటీ అవుతుంది. తొలి దశ ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. తర్వాత పార్లమెంటరీ కమిటీలు మంత్రిత్వ శాఖల వారీగా గ్రాంట్ల డిమాండ్లను పరిశీలించడానికి వీలుగా సమావేశాలను వాయిదా వేస్తారు. అనంతరం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో దశ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి.
