అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (Telangana Employees Joint Action Committee-TGEJAC) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) తెలిపారు. ఈ సందర్భంగా.. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను టీజీఈజేఏసీ(TGEJAC) నాయకత్వం ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బి.శ్యామ్ను ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకి పరిచయం చేయగా అభినందించారని అన్నారు. పదవీ విరమణ చేసిన ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణను శాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో.. ముజీబ్ హుస్సేన్, ఎ.సత్యనారాయణ, మధుసూదన్రెడ్డి, బి.శ్యామ్, అనిల్ కుమార్, కస్తూరి వెంకటేశ్వర్లు, తిరుపతి యాదవ్, సత్యనారాయణగౌడ్, సహదేవ్, నరహరిరావు, శ్రీరామ్రెడ్డి, శిరీష, సురేష్ నాయక్, ఎం.బి.కృష్ణ యాదవ్, డాక్టర్ రామారావు, నరసింహారెడ్డి, షౌకత్ హుస్సేన్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
