అధికారులు సమన్వయంతో ఏర్పాట్లుచేయాలని పొన్నం ఆదేశం
కరీంనగర్ మార్కెట్ రోడ్(Karimnagar Market Road)లోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ (Venkateswara Swami Temple) వార్షిక బ్రహ్మోత్సవాల(Annual Brahmotsavam)ను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) చెప్పారు. ఈ నెల 23 నుంచి 30 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం ఆలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలి. గతేడాది మాదిరిగానే స్వామివారి సేవకు ముందుకొచ్చి విరాళాలు సమర్పిస్తున్న దాతలకు ధన్యవాదాలు. బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వేడుకలు నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Suda Chairman Komatireddy Narender Reddy) మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ అధికారులతో వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.
కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy) మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లుచేయాలని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్య శిబిరం ఏర్పాటుచేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో శానిటేషన్, క్లీనింగ్ సమస్యలు రాకుండా చూస్తామన్నారు.
ఈ సందర్భంగా పలువురు దాతలు బ్రహ్మోత్సవాల నిర్వాహణకు విరాళాలను ప్రకటించారు. సమావేశంలో ఆర్డీవో మహేశ్వర్, కరీంనగర్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రె రాజశేఖర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆలయ చైర్మన్లు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఏసీపీ వెంకటస్వామి, ఈవో సుధాకర్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

