- హిందూదేవుళ్లపై రేవంత్ వ్యాఖ్యలు
- గాంధీభవన్ ముట్టడికి బీజేపీ యత్నం
- అడ్డుకున్న పోలీసులు.. స్వల్ప ఉద్రిక్తత
- పలువురు బీజేపీ శ్రేణులకు గాయాలు..
నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. నాంపల్లిలోని గాంధీభవన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు బుధవారం స్పందిస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు తాము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. గాంధీ భవన్ను ముట్టడించేందుకు వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సైతం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. గాంధీ భవన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. నేతల మధ్య ఏమైనా మనస్పర్థలు ఉంటే వాటిని అధిగమించి..
అందరిని కలుపుకుని పోవాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను ఉదాహరించారని చెప్పారు. అంతేకాని హిందూ దేవుళ్లను కించపరిచే ఉద్దేశ్యం సీఎం రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో లేదని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అదీకాక రేవంత్ రెడ్డి పాలనపై విమర్శించేందుకు బీజేపీ నేతలకు ఏ అంశం దొరకలేదని చెప్పారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వారు ఆక్షేపిస్తున్నారని చెప్పారు.
