2026 జనవరి 13న యాదాద్రి భువనగిరి జిల్లా పెంచికల్ పహాడ్ గ్రామంలో లైంగిక దాడికి గురైన నాలుగేళ్ల చిన్నారి భాదిత కుటుంబాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడభ్ల్యూ విముక్తి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పెర్క సునీత డిమాండ్ చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ డిమాండ్ ను ఆమె వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో పసిపిల్లపై జరిగిన అత్యాచారం కారణంగా తీవ్ర హింసకు గురై ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఇప్పటికే 12 రోజులు గడిచినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం తీవ్రంగా తప్పు అని బహుజన సత్త రాష్ట్ర అధ్యక్షుడు బండకింది సింగరయ్య గౌడ్ విమర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం ప్రజాప్రతినిధిగా ఉన్న సామాజిక బాధ్యతను విస్మరించినట్లేనని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి బాధిత కుటుంబానికి మానసిక ధైర్యం ఇవ్వాలని, లేకపోతే ఇది అమానుష వైఖరికి నిదర్శనమవుతుందని పెర్క సునీత మండిపడ్డారు.

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జనవరి 24 శనివారం జీహేచ్ఎంసి పరిధిలోని వికలాంగుల కాలనీలో ఐలపు పద్మ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక టియుకెవి రాష్ట్ర కమిటీ సభ్యురాలు తుమ్మరాణి మాట్లాడుతూ, అత్యాచారాలు లైంగిక హింసలను సమాజం తీవ్రమైన నేరాలుగా భావించకపోవడమే బాలికలపై నేరాలు పెరగడానికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టియుజేఏసి రాష్ట్ర కమిటీ సభ్యురాలు సన్వాల సుచరిత మాట్లాడుతూ, రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదలపై సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే బాలికలు అక్రమ రవాణా, దాడులు, అభద్రతకు గురవుతున్నారని తెలిపారు. సమాజంలో ఆడపిల్లల పట్ల కొనసాగుతున్న వివక్షతను వదిలిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.భారత కార్మిక సంఘాల సమాఖ్య ఇఫ్టూ కన్వీనర్ షేక్ షావలి మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో చిన్నారి నుంచి వృద్ధుల వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిత్యం న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్, శోషల్ మీడియాల్లో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణ సంఘటనలు మానవత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు లైంగిక హింసకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.సాంకేతిక పరిజ్ఞానం పిల్లల సర్వాంగీన అభివృద్ధికి ఉపయోగపడాల్సిందిగా, కాని అదే లింగ వివక్షత, లైంగిక హింస, గృహహింస పెరగడానికి కారణమవుతుండటం బాధాకరమని షేక్ షావలి తెలిపారు.
గత 18 సంవత్సరాలుగా జాతీయ బాలికా దినోత్సవం పేరిట పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, బేటి బచావో బేటి పడావో నినాదాల మధ్య మహిళలు, పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో జీవించే హక్కును కూడా కోల్పోతున్నారని విమర్శించారు.సభ్య సమాజంలో మనిషిని మనిషిగా గౌరవించే విలువలు నెలకొల్పాల్సిన అవసరం ఉందని, ఆడపిల్లను గౌరవంగా చూసే వ్యవస్థ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ చారి, బీసి నాయకుడు డి నర్సన్న, మైసయ్య, యమునా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
