- విద్యార్థులు లేక వెలవెలబోతున్న బీఎఫ్ఎస్ఐ కోర్సు క్లాసులు..
కోర్సు చదివే సమయంలోనే ఇంటర్న్షిప్, స్టైపండ్ .. కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ..! ఇలా అనేక మాటలు చెప్పి ప్రారంభించిన ఓ డిగ్రీ కోర్సు అట్టర్ఫ్లాప్ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన ఈ కోర్సుకు ఆదరణ కనిపించడంలేదు. విద్యార్థులు చేరేందుకు ముందుకురావడంలేదు. భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతో చేరిన వారు సైతం డ్రాపౌట్ అవుతున్నారు.
బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సును విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025 జూన్లో సీఎం రేవంత్రెడ్డి ఈ కోర్సును ప్రారంభించారు. ఆరు నెలల వ్యవధి గల ఈ కోర్సు రెగ్యులర్ డిగ్రీకి అదనం. విద్యార్థి 16 క్రెడిట్స్ సాధిస్తే సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ఇంజినీరింగ్ సహా ఏ కోర్సువారైనా దీన్ని తీసుకునే అవకాశం ఇచ్చారు..
బీఎఫ్ఎస్ఐ సెక్టార్కు తీవ్ర డిమాండ్ ఉందని, ఈ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేశారు. శిక్షణ సమయంలో రూ. 5వేలు ైస్టెపెండ్ లభిస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్లో ఈ ఏడాది 5వేల మంది, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 5వేల మంది చొప్పున మొత్తం 10వేల మందిని చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కోర్సు పూర్తిచేసిన వారికి జేపీ మోర్గాన్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టేట్ స్ట్రీట్, హెచ్ఎస్బీసీ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని, ఇందుకు ఇటీవలే ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నదని వెల్లడించారు.
కొందరు విద్యాశాఖ అధికారులు ఈ కోర్సు స్థితిగతులపై సమీక్షించగా ప్రస్తుతం 136 మంది మాత్రమే మిగిలినట్టు తేలింది. వందలాది విద్యార్థులు కోర్సులో చేరి మధ్యలోనే డ్రాపౌట్ అయ్యారు. ఈ కోర్సు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి రూ. లక్షలు ఖర్చుచేశాయి. సమావేశాలు, శిక్షణ, వర్క్షాప్లు, ప్రారంభాల పేరిట నీళ్ల ప్రాయంలా నిధులు ఖర్చుచేశారు. అయితే ఈ కోర్సులో చేరిన విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
