- ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి
- ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి..
- ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలి
- సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరు గైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారు లకి సీఎం దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
తొలి దశలో అవుటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్పై దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సూచించారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆజ్ఞాపించారు. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయండి. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని సీఎం సూచనలు చేశారు.
