మక్తల్లో బీజేపీ గిరిజన అభ్యర్థి ఎరుకల మహాదేవప్పపై కాంగ్రెస్ నేతల దారుణానికి నిరసనగా బీజేపీ నేతలు హైదరాబాద్లో డీజీపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఈ సందర్భంగా కార్తీక చంద్రారెడ్డి మాట్లాడుతూ న్యాయం కోరినందుకే అరెస్టులు చేయడం దుర్మార్గమని,రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజాస్వామ్యానికి ఇదే నిదర్శనమా అంటూ మండిపడ్డారు.ఎరుకల మహాదేవప్పపై జరిగిన రాజకీయ వేధింపులే ఆయన ప్రాణాలకు కారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బయటపడిందన్నారు.ఈ ఘటనపై పూర్తిస్థాయి పారదర్శక దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
