ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)ను ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ (Business Reformer of the Year) అవార్డు (Award) వరించింది. మన దేశంలోని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ (The Economic Times) ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. 2026 మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ.. చంద్రబాబును ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది.
ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్(2024), ఎస్.జైశంకర్(2023), నిర్మలా సీతారామన్ (2021), మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్(2019), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(2017), పీయూష్ గోయల్(2015) వంటి వారు అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు.
