పోలీస్ కమిషనర్ సజ్జనార్కు అఖిలపక్ష నేతల వినతి
సికింద్రాబాద్, జనవరి 22(ఆదాబ్ హైదరాబాద్): జీహెచ్ఎంసీ(GHMC) పరిధి విస్తరణ(Expansion) నేపథ్యంలో పోలీస్ స్టేషన్ల పరిధులు మారడంతో సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తుకారంగేట్ పోలీస్ స్టేషన్(Tukaramgate Police Station)ను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో చేర్చారు. దీంతో.. అడ్డగుట్ట–తుకారంగేట్ ప్రాంతంలోని సుమారు 90 శాతం ప్రాంతాన్ని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చడం వల్ల స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లాలాగూడ స్టేషన్ 2–3 కిలో మీటర్ల దూరంలో ఉండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడం, భద్రతా సమస్యలు ఉండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అఖిలపక్ష నేతలు(All Party Leaders) తెలిపారు.
ఈ నేపథ్యంలో అడ్డగుట్ట–తుకారంగేట్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయాలని లేదా ప్రస్తుత తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ప్రాంతాన్ని కొనసాగించాలని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్(Hyderabad City Police Commissioner) వీసీ సజ్జనార్(VC Sajjanar)ను కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత వి.నర్సింగ్ రావు, కె.గంగారాం, సీపీఎం సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి ఆర్.మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం మల్లేష్, ఇ.చంద్రర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి, బీఎస్పీ సికింద్రాబాద్ జిల్లా ఇన్చార్జ్ బి.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
