ACA కార్యదర్శి, ఎంపీ సానా సతీష్ బాబు పర్యవేక్షణలో ఘనంగా ఏర్పాట్లు
ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్-2025లో ఇండియాని విజేతగా నిలపటంలో కీలక పాత్ర పోషించి తొలిసారి స్వరాష్ట్రానికి వచ్చిన శ్రీచరణి(SriCharani)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AndhraPradesh Government) శుక్రవారం అపూర్వ సాగతం పలికింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం(Gannavaram International Airport)లో ఆమెకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association-ACA) ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. స్వాగత ఏర్పాట్లను ACA కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ (RajyaSabha Mp) సానా సతీష్ బాబు (Sana Satish Babu) స్వయంగా పర్యవేక్షించారు. ఎయిర్పోర్ట్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన అభిమానులు, చిన్నారులతో కలిసి ఆయన జాతీయ జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో శ్రీచరణిని స్వాగతించారు. పుష్పగుచ్ఛం అందించి రాష్ట్రానికి ఆమె తెచ్చిన గౌరవాన్ని మెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచరణి విజయం కేవలం క్రీడా విజయం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ యువతకు, ముఖ్యంగా క్రీడాకారిణులకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంసించారు. క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏసీఏ అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు.
అనంతరం.. శ్రీచరణితోపాటు ప్రముఖులంతా ఉండవల్లిలోని సీఎం నివాసానికి ర్యాలీగా వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్ ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సన్మాన కార్యక్రమంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, చేనేత శాఖ మంత్రి సవిత, ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ, శాప్ (SAAP) అధ్యక్షుడు రవి నాయుడు, శాప్ ఎండీ భరణి, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
