- సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు..
- నిందితులు అరెస్ట్ అయిన వెంటనే అప్లోడ్ చేయడం తగదు..
నిందితుల ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మీడియాలా తయారయ్యారని వ్యాఖ్యానించింది. ఇలాంటి సోషల్ మీడియా ధోరణి పారదర్శక విచారణకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. అరెస్టయిన నిందితుల వీడియోలు, ఫొటోలను పోలీసులు అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలలో ఎలా అప్లోడ్ చేస్తారని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శనివారం విచారణ జరిపింది.
అరెస్ట్ చేసిన నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తుందని, ఆ నిందితులు నిర్దోషులుగా విడుదలైతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పిల్ దాఖలైంది. ఒక కేసు విషయంలో పోలీసుల మీడియా బ్రీఫింగ్పై మార్గదర్శకాలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించిందని, అందులో సోషల్ మీడియాను కూడా చేర్చాలని పిల్ వేసిన పిటిషనర్ కోరారు. ఈ పిల్పై జరిగిన విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
