- రనౌట్ నుంచి తప్పించుకోబోయి కిందపడ్డ రఘురామ..
- కబడ్డీలో ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ శ్రీకాంత్కు గాయాలు
శాసనసభలో వాడివేడి చర్చలతో కనిపించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు అమరావతి క్రీడా మైదానంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతూ ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు గాయపడ్డారు. ఈ ఘటనలతో క్రీడాపోటీల్లోనూ రాజకీయ వేడి కనిపిస్తోందని చర్చ జరుగుతోంది.
క్రికెట్ మ్యాచ్లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డారు. పరుగు తీసే క్రమంలో రనౌట్ నుంచి తప్పించుకోవడానికి క్రీజులోకి డైవ్ చేయబోయి అదుపుతప్పారు. దీంతో శరీర బరువు మొత్తం ఎడమ భుజంపై పడటంతో మణికట్టు, బొటనవేలికి గాయాలయ్యాయి. వెంటనే మైదానంలో ప్రథమ చికిత్స అందించినా నొప్పి తగ్గకపోవడంతో ఆయనను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నేడు ఆయన హైదరాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం.
ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీల్లో ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గాయపడ్డారు. ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకునే ప్రయత్నంలో కింద పడటంతో పార్థసారథి పాదానికి గాయమైంది. అదే సమయంలో కంచర్ల శ్రీకాంత్కు భుజం వద్ద కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు.
