- నయనానందకరంగా స్వామివారి అలంకారాలు.
- మత్స్యావతార,శేష వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చిన యాదాద్రి లక్ష్మీ నృసింహుడు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను చూడడానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు.
స్వామివారి అలంకారాలు చూసి భక్తులు తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు.స్వామివారి అలంకారాలను తీర్చిదిద్దడానికి ప్రత్యేక ఆచార్యులను నియమించింది దేవస్థానం.బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు స్వామి వారిని ఉదయం మత్స్యావతార అలంకార సేవలో స్వామివారిని అలంకరించారు.సాయంత్రం శేష వాహన సేవలో స్వామివారిని అలంకరించి భక్తుల దర్శనార్థం ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించనున్నారు.

మత్స్యావతార అలంకార సేవ విశిష్టత:
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యావతారం అత్యంత ప్రసిద్ధి చెందినది.సృష్టి కార్యానికి ఆటంకం కలిగించే దానవులను సంహరించి, ప్రళయకాలంలో వేదాలను రక్షించి,బ్రహ్మాది దేవతలకు సృష్టిని నిర్వహించుటకు,దొంగిలించిన వేదాలను తిరిగి తెచ్చి లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించారు.అజ్ఞానమనే చీకటిని తొలగించి,ధర్మాన్ని నిలబెట్టడానికి పునాది వేసిన అవతారం ఇది.

శేష వాహన సేవ అలంకార విశిష్టత:
బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు శేష వాహన సేవ నిర్వహిస్తారు. ఆదిశేషుడు విష్ణువుకు శయ్యగా, గొడుగుగా నిరంతరం సేవ చేస్తూ దాస్య భక్తికి నిదర్శనంగా నిలుస్తాడు.శేష వాహనంపై స్వామిని దర్శిస్తే కుండలినీ శక్తి జాగృతమై,మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.అంతేకాక సర్ప భయాలు,దోషాల నుండి విముక్తి లభిస్తుంది.ఆదిశేషుడు అనంత కాలానికి ప్రతీక కాబట్టి,కాలం మనకు అనుకూలిస్తుందని భక్తుల విశ్వాసం.

ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాలలో కళాకారుల మంగళ వాయిద్యాలు, భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వారిచే నిర్వహింపబడు విష్ణు సహస్రనామ పారాయణాలు,శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారిచే,స్వామివారి సేవలు ముందు,చిన్నారుల అలంకార సేవలు,కోలాటాలు నిత్యములు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు,ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ,ఈవో భవాని శంకర్, డిఇఓ దోర్బల భాస్కర్ శర్మ,ఏఈఓ గజవెల్లి రఘు,ఉప ప్రధానార్చకులు లక్ష్మణచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి,శ్రీధరాచార్యులు, ముఖ్య అర్చకులు గట్టు వెంకటాచార్యులు,కిరణ్ కుమారాచార్యులు,అర్చకులు మురళీకృష్ణ,రాకేష్,సూపరింటెండెంట్ సీతారామ చారి,ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు,ఏఎస్ఐ రాజయ్య,ఎస్పీఎఫ్ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
