రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ రాష్ట్రానికి(Telangana State) మరోసారి ఛాన్స్ మిస్ అయింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆర్-డే పరేడ్లో చోటు దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది (77వ) గణతంత్ర దినోత్సవ శకట ప్రదర్శనలోనూ స్లాట్ను కోల్పోవడానికి త్రీ-ఇయర్ రొటేషనే(Three Year Rotation) కారణమని కేంద్రం పేర్కొంది. ఈ విధానంలో మూడేళ్లకోసారి అవకాశం వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చివరిసారిగా 2024లో ఛాన్స్ వచ్చింది. మళ్లీ 2027 (వచ్చే ఏడాది) అవకాశం లభిస్తుంది. ఈ నెల (జనవరి) 26న కర్తవ్య పథ్లో జరిగే కవాతు కోసం కేంద్రం 30 శకటాలను ఆమోదించింది. వాటిలో 17.. రాష్ట్రాలవి. 13.. కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలవి. ఈ సంవత్సరం ప్రధాన కవాతులో చోటు దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఆ ప్రతిపాదన తిరస్కారానికి గురైంది. ఇది నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా తెలంగాణ తన సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి పురోగతిని ప్రతిబింబించే శకటాన్ని ప్రదర్శించాలని ఆశించింది.
