53వ రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన(Children’s Science Exhibition) ఇన్స్పైర్ ప్రాజెక్ట్(Inspire Project) ప్రదర్శన కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ(Zaheerabad MP) సురేష్ శెట్కర్(Suresh Shetkar), ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి(MLC Sripal Reddy) పాల్గొన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంతగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన అతిథులు.. భవిష్యత్ దేశ నిర్మాణంలో శాస్త్ర సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా వ్యవసాయ సుస్థిరత అంశంలో ఆధునిక సాగు పద్ధతులు, నీటి పొదుపు సాంకేతికతలను ప్రదర్శించారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ–ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు అనే అంశంలో పర్యావరణానికి హాని కలగని పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు.
అలాగే.. హరిత ఇంధనంపై సౌర, గాలి విద్యుత్ నమూనాలు, శాస్త్ర సాంకేతికతలో నూతన పోకడలు, గణిత నమూనాలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత, నేటి పర్యావరణ పరిరక్షణ నిర్వహణ వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మహమ్మద్ షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న వయసు నుంచే ఆవిష్కరణలు, పరిశోధనలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ‘బాల వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తాయి. చిన్న వయసులోనే శాస్త్రీయ ఆలోచన అలవడితే భవిష్యత్లో గొప్ప శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలుగా ఎదుగుతారు. నేడు విద్యార్థులు రూపొందిస్తున్న ఈ నమూనాలు రేపటి దేశాభివృద్ధికి పునాదులుగా మారతాయి. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధనం వంటి అంశాలపై విద్యార్థులు చూపుతున్న ఆసక్తి అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి, పరిశోధనలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తూనే ఉంటుంది’ అని అన్నారు.
ఎంపీ సురేష్ శెట్కర్ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేకుండా దేశం ముందుకు సాగదని చెప్పారు. ఇన్స్పైర్ ప్రాజెక్ట్ల ద్వారా విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం పెంపొందించడం శుభపరిణామమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం(Abdul Kalam)ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యా, శాస్త్ర పరిశోధన రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మాజీ ఎంపీపీ నర్సింగరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, శాస్త్ర నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
