భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి ఒక విద్య మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించడం కోసం ప్రజా ప్రభుత్వం ఎంత ఖర్చు అయిన పెడుతుందని తెలిపారు. ఈ రోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామంలో రూ. 61 లక్షలతో చేపట్టిన కేజీబీవీ (KGBV) భవన మరమ్మతు పనులకు, కొక్కిరేణి గ్రామంలో రూ. 3 కోట్లతో తిరుమలాయపాలెం నుండి పోచారం రోడ్డు స్లాబు కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
డైనింగ్ హాల్, గ్రిల్, దోమల తెర, మొదలగు మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలాయపాలెంలో ఉన్న ఐటిఐ కాలేజీ(ITI College)ని మెయిన్ రోడ్డు వద్ద షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అక్కడ భూమి (Land) దొరికితే, ఇక్కడ ఖాళీగా ఉండే మూడు ఎకరాలు కేజీబీవీ ప్లే గ్రౌండ్ కోసం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్ధుల బాధలు గమనించి 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. భావితరాలకు అందించే ఆస్తిగా పరిగణించి విద్య, వైద్యం రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోందని అన్నారు.
