Wednesday, February 11, 2026
HomeతెలంగాణPonnam | ఇకపై హత్య కేసులు

Ponnam | ఇకపై హత్య కేసులు

ట్రావెల్స్ ఓనర్లకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్
కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర స్పందన
నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక
ఫిట్‌నెస్, ఇన్స్యూరెన్స్ లేని బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడి

ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travells) యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు పోతే ఇకపై వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prbhakar) తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) నేపథ్యంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

కర్నూలులో జరిగిన దురదృష్టకర ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్(Fitness), ఇన్స్యూరెన్స్(Insurance), స్పీడ్ నిబంధనల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, వాటిని కచ్చితంగా పాటించాలని యజమానులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే, తమను వేధిస్తున్నారని కొందరు యజమానులు ఆరోపిస్తున్నారని, ఆ కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వివరాలు కూడా లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ (Registration) అయిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో త్వరలో సమావేశమై, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించి, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News