ప్రస్తుతం టీమ్ఇండియా వన్డే కెప్టెన్ సారథిగా ఉన్న రోహిత్ శర్మ ప్రయాణం ముగిసింది. అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్కు అప్పగించింది. ఈ ఏడాదే భారత టెస్టు కెప్టెన్గా పగ్గాలు అందుకున్న శుభ్మన్ గిల్.. వన్డేల్లోనూ ఆ బాధ్యతలను మోయనున్నాడు. దీంతో అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్లో శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. గత కొన్నేళ్లుగా వన్డే టీమ్ను నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అతడితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.
వన్డే ప్రపంచకప్ 2027 నాటికి పటిష్ట జట్టును తయారు చేయడమే లక్ష్యంగా భారత సెలక్షన్ కమిటీ కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకుంది. ఇక వన్డే జట్టుకు వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసింది. ఇదే టూర్లో ఆసీస్లో భారత్ ఐదు టీ20లు ఆడనుంది. టీ20 మ్యాచ్లు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. హార్దిక్ పాండ్య గాయపడిన వేళ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి వన్డే జట్టులో చోటు దక్కింది. మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, సంజు శాంసను అవకాశం కల్పించలేదు. వన్డేల్లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి ప్రసిద్ధి కృష్ణను ఎంపిక చేశారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్నే కెప్టెన్గా కొనసాగించారు.