హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) కు సంబంధించి కీలకమైన చర్యలు ప్రారంభించింది. ఇటీవల దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల, మరియు మేడిగడ్డ బ్యారేజీలకు శాశ్వత మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్ల తయారీ కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA) కమిటీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగానే ఈ రిహాబిలిటేషన్ మరియు రీపోర్టేషన్ డిజైన్లను రూపొందించనున్నారు. ఈ డిజైన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువును అక్టోబర్ 15, మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాణ్యతా లోపాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ విచారణకు సంబంధించి 600 పేజీల నివేదికను ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణను సిబిఐకు అప్పగించడం జరిగింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను సీబీఐ ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడింది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి ప్రముఖ నేతలతో పాటు పలువురు అధికారులను సీబీఐ త్వరలోనే విచారించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ అంశంపై సీబీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
మరిన్ని వార్తలు :