- ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం
- ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ శిల్పి రామ్ సుతార్ రూపకల్పన
దక్షిణ గోవా కనకోన పట్టణంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల ఎత్తైన శ్రీరాముని కంచు విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. సాధువులు, సంతులతో తనకున్న ఆధాత్మిత అనుబంధాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజలు తమ సంస్కృతితో మమేకమయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

మఠం 550వ వార్షికోత్సవంపై ఆర్గనైజేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఎస్ ముకుంద్ కామత్ మాట్లాడుతూ, 15,000 మంది ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారని చెప్పారు. శంకర్ మహదేవన్, అనూప్ జలోటా తదితర ప్రముఖ కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది. 13వ శతాబ్దంలో జగద్గురు మధ్వాచార్యులు స్థాపించిన ద్వైత సిద్దాంతాన్ని ఈ మఠం అనుసరిస్తుందని పేర్కొంది.
