- మార్చి 3… ప్రపంచ వినికిడి దినోత్సవం
వినికిడి గురించి మానవాళికి ప్రచారం కలిగించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ టెలిఫోన్ ను కనుగొన్న గ్రాహంబెల్ జన్మదినాన్ని ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపు కుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007, 3న ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. 2016కు ముందు దీనిని అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం అని పిలిచే వారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంధత్వం, చెవుడు నివారణ కార్యాలయం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

నేడు మనం వాడుతున్న ఫోన్లకు మాతృక అయిన “టెలిఫోన్” అనేదాన్ని కనిపెట్టింది అమెరికాకు చెందిన “అలెగ్జాండర్ గ్రాహెంబెల్” అని మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. టెలీ ఫోను అంటే… టెలీ అనగా దూర, ఫోను అంటే వాణి… దూరవాణి అని అర్థం. ఇది సాధారణంగా ఇద్దరు, మరికొన్ని సమయాలలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించు కునేందుకు ఉపయోగిస్తుంటారన్న సంగతి మనకు తెలిసిందే.

అలెగ్జాండర్ గ్రాహెంబెల్ స్కాట్లాండులోని ఎడిన్బర్గ్ అనే ప్రాంతంలో మార్చి 3, 1847వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు అలెగ్జాండర్ మెల్విల్లే బెల్ (ప్రొఫెసర్) కాగా, తల్లి పేరు ఎలిజా గ్రేస్. గ్రాహెంబెల్. చిన్న వయసు నుంచే సహజంగానే అనేక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా గ్రాహెంబెల్ కు ఆ రోజుల్లోనే పరిశీలనా శక్తి అధికంగా ఉండేది. తన పక్కింట్లో నివాసముండే తన స్నేహితుడు బెన్ హెర్డ్మెన్ సహాయంతో గ్రాహెంబెల్ 12 ఏళ్ల ప్రాయంలోనే “ఇన్వెంట్” అనే పేరుతో చిన్న వర్క్షాప్ను నిర్వహించాడు.
తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. ఆమె నుదిటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు.

బెల్లోని విజ్ఞాన తృష్ణకు తల్లి చెవిటితనం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఆపై ఎడింబరో విశ్వ విద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో ‘గాత్ర సంబంధిత శరీర శాస్త్రం’ (వోకల్ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్గా చేరాడు. భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి, వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్ను కనిపెట్ట గలిగాడు.
ఇలా కనిపెట్టినదే టెలీఫోను. దీనిని 1876 రూపొందించిన గ్రాహెంబెల్ మొదటిసారిగా ఉపయోగిస్తూ, పక్కగదిలో ఉన్న వాట్సన్తో మాట్లాడారు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది.
గ్రహంబెల్ ను చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నా ఆయన వివిధ రంగాలలో ఆసక్తిని కనబరచాడు. ఆప్టికల్ టెలి కమ్యూనికేషన్స్, హైడ్రోఫాయిల్స్, ఏరోనాటిక్స్ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశాడు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహంబెల్ కూడా అయన ఒకరు.
1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. దీని విలువ 50,000 ఫ్రాంకులు ( సుమారు 10,000 డాలర్లు).
తన జీవిత కాలమంతా రకరకాల పరిశోధనలతో గడిపిన గ్రాహెంబెల్ తన 75 సంవత్సరాల వయసులో చక్కెర వ్యాధికి గురయ్యాడు. ఈ వ్యాధి కారణంగానే 1922 ఆగస్టు 2వ తేదీన మరణించాడు.
