- ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
- జిహెచ్ఎంసీ పునర్విభజనతో సికింద్రాబాద్కు ఎనిమిది డివిజన్లు
- రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 8 డివిజన్లలో ఘన విజయం సాధిస్తాం
- కార్పొరేటర్లతో చివరి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడ్డగుట్ట,మెట్టుగూడ,సీతాఫల్మండి,బౌద్ధ నగర్,తార్నాక డివిజన్లలో ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లుగా ఎన్నికైన నాటినుంచి గత ఐదేళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై,ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మహిళా కార్పొరేటర్లను సికింద్రాబాద్ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అభినందించారు.గురువారం సికింద్రాబాద్ మధురానగర్ కమిటీ హాల్లో కార్పొరేటర్లతో నిర్వహించిన చివరి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వారి సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు డివిజన్లకు అదనంగా మరో మూడు డివిజన్లు చేర్చడం జరిగిందని ఆయన తెలిపారు.స్థానిక ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం చూపారని అన్నారు.అయితే నేటి ప్రజాపాలన ప్రభుత్వ హయాంలో ఆ కార్యాలయాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని విమర్శించారు.
రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లు చేసిన సేవలు,వారి సంకల్పానికి గుర్తింపుగా సికింద్రాబాద్ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,కార్యకర్తలు,అభిమానుల ఆదరణతో ఎనిమిది డివిజన్లలో ఘన విజయం సాధించి విజయ దుందుభి మోగిస్తామని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తే విజయం ఖాయమని ఆయన అన్నారు.
జిహెచ్ఎంసీ డివిజన్ కార్పొరేటర్లుగా తమకు అవకాశం కల్పించి,అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకువెళ్లిన ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్కు,అలాగే తమను ఆదరించిన పార్టీ శ్రేణులు,అభిమానులు,సికింద్రాబాద్ ఓటర్లకు సీతాఫల్మండి,అడ్డగుట్ట,మెట్టుగూడ,బౌద్ధ నగర్ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లను బట్టి ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకే మళ్లీ అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వెల్లడించారు.
