ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో బెంగళూరు టార్పెడోస్ మరోసారి అద్భుతమైన పునరాగమనంతో ఆకట్టుకుంది. ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్లో తొలి సెట్ కోల్పోయినప్పటికీ పుంజుకున్న బెంగళూరు 3–1 (11-15, 15-13, 15-11, 15-11) తేడాతో కోల్కతా థండర్బోల్ట్స్ ను ఓడించింది. లీగ్లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జోయెల్ బెంజమిన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
ఈ మ్యాచ్ ఆరంభంలో కోల్కతా థండర్బోల్ట్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అశ్వల్ రాయ్, మతిన్ అద్భుతమైన బ్లాకింగ్తో బెంగళూరు ఎటాకర్లను కట్టడి చేశారు. దీనికి తోడు సేతు ఎటాకింగ్లో చేసిన పొరపాట్లతో టార్పెడోస్ వెనుకబడింది. మతిన్ తన సూపర్ సర్వ్తో బెంగళూరును మరింత దెబ్బతీయడంతో కోల్కతా సులభంగా తొలి సెట్ను కైవసం చేసుకుంది. అయితే, రెండో సెట్ నుంచి బెంగళూరు ఎదురుదాడికి దిగింది. జాలెన్ పెన్రోస్, సేతు ఎదురు దాడులకు దిగడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కీలక సమయంలో కోల్కతా కోరిన సూపర్ పాయింట్, జోయెల్ మెరుపు స్పైక్తో బెంగళూరు ఖాతాలోకి వెళ్లడంతో ఇరు జట్లూ చెరో సెట్ నెగ్గి ఆటను రసవత్తరంగా మార్చాయి.
ఆ తర్వాత బెంగళూరు మ్యాచ్పై క్రమంగా పట్టు సాధించింది. కోల్కతా ఆటగాడు సూర్యాన్ష్ తోమర్ తన హై జంప్స్తో బెంగళూరు డిఫెన్స్ను పరీక్షించినా ఫలితం లేకపోయింది. వరుసగా రెండు సూపర్ పాయింట్లను గెలుచుకున్న బెంగళూరు మ్యాచ్ను తమ వైపు తిప్పుకుంది. ముజీబ్ సరైన సమయంలో బ్లాక్ చేసి కోల్కతా దాడిని అడ్డుకున్నాడు. పెన్రోస్ సంధించిన సూపర్ సర్వ్ బెంగళూరుకు రెండు కీలక పాయింట్లను అందించి విజయాన్ని ఖాయం చేసింది.కోల్కతా చివరి నిమిషం వరకు పోరాడినా టార్పెడోస్ దూకుడు ముందు నిలవలేకపోయింది.

