భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి మహోత్సవాల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి మహోత్సవాల్లో (Bhagawan Sri Sathya Sai Baba’s Centenary Celebrations) ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (Vice President CP Radhakrishnan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత మాత(Bharatha Matha)కు, సత్య సాయి బాబాకు ప్రణామాలు అర్పిస్తూ ప్రసంగం ప్రారంభించారు. ఈ పవిత్ర వేదికపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడు మంత్రి శేగరబాబు, హైకోర్టు చీఫ్ జస్టిస్లు, సత్య సాయి సంస్థ ప్రతినిధులతో కలిసి పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఉపరాష్ట్రపతి ఇంకా ఏమన్నారంటే..
1964–65 మధ్య కాలంలో మా కుటుంబానికి సాయిబాబా ఆశీస్సులు (Blessings of Sai Baba) అందాయి. తమిళం మాత్రమే తెలిసిన మా అత్తయ్య ఒంటరిగా పుట్టపర్తికి వచ్చి 15 రోజులు ఉండి సాయి బాబా ఆశీస్సులు తీసుకొచ్చారు. ఇది భగవాన్ దైవిక శక్తికి నిదర్శనం. ఇక్కడకు రావడం దైవానుగ్రహం లేకుండా సాధ్యం కాదు. ఈ పవిత్రక్షేత్రాన్ని సందర్శించే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. భగవాన్ సత్య సాయి బాబా శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవల ప్రతిరూపం.
Love All.. Serve All, Help Ever.. Hurt Never
సత్యసాయి బాబా చేసిన ఈ బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత. సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అందిస్తున్న మహత్తర సేవలకు ప్రత్యేక ప్రశంసలు. ఉచిత విద్య అందిస్తున్న సత్య సాయి విశ్వవిద్యాలయం, గ్రామీణ ఆరోగ్య సేవలు, ఉచిత గుండె శస్త్ర చికిత్సలు, తాగునీటి ప్రాజెక్టులు, విపత్తు సహాయ కార్యక్రమాలు లక్షలాది మందికి జీవనాధారమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు గంగ ప్రాజెక్ట్ పునరుద్ధరణలో, చెన్నైకి నిరంతర తాగునీరు అందించడంలో సాయిబాబా సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ప్రపంచం నేడు సంఘర్షణలు, ఒత్తిడితో నిండిన సమయంలో భగవాన్ బోధించిన ప్రేమ, ఐక్యత, సేవ వంటి విలువలు మరింత అవసరం. భగవాన్ మహాసమాధి తరువాత కూడా ఇక్కడికి వచ్చి సేవలో కొనసాగుతున్న భక్తులకు అభినందనలు. సేవే మానవత్వాన్ని కలుపుతుంది. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. కుటుంబాల్లో, సమాజంలో, దేశంలో శాంతిని పెంపొందించడం మన బాధ్యత. భగవాన్ వారసత్వాన్ని కేవలం మాటల్లో కాదు. సేవలో కొనసాగించాలి. జై సాయి రామ్, జై హింద్, భారత్ మాతాకి జై.
