పాలేరు నియోజకవర్గ చరిత్ర(Paleru Constituency History)లో కనీవినీ ఎరగని రీతిలో రూ. 362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదగా జరగనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) చెప్పారు. సీఎం పాలేరు పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంతోపాటు మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ను ప్రారంభిస్తారు. అలాగే కూసుమంచిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారు.
ఇదే వేదికగా రాబోయే మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(కేబినెట్ మీటింగ్) నిర్వహిస్తారు. సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కన్నా అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం సీఎం రేవంత్ ప్రారంభిస్తారు’ అని వెల్లడించారు.

