సనాతన హిందూ పరిరక్షణలో భాగంగా బాలాజీ నగర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శెట్టి మాధవి ఆధ్వర్యంలో వనితా శంఖారావం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి బ్రహ్మచారి విద్యా శంకరానంద స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్, ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్, వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగ్ తెలంగాణ రాష్ట్ర శాఖలు సంయుక్తంగా ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో శ్రీ శివ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శివ స్వామీజీ నేతృత్వంలో 1,51,116 మంది భక్తులతో వనితా శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మణిద్వీప వర్ణన, శ్రీమద్ భగవద్గీత పారాయణం, శివ సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం తదితర ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ధర్మ శిరోమణి అవార్డ్స్ ను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. సనాతన హిందూ పరిరక్షణ కోసం మహిళలు ముందుకు సాగాలని, హిందువుల సంఘటిత శక్తిని చైతన్యపరచేందుకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిత హైమ, రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి, భాగ్యనగర్ అధ్యక్షురాలు సమత, కోఆర్డినేటర్ శ్రీదేవి, అమర్ జ్యోతి, స్రవంతి, వాసవి సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్త, బిజెవైఎం రాష్ట్ర నాయకులు సంతోష్ గుప్త, వేపుల సన్నీ, కార్తిక్, ప్రశాంత్, సంఘ సభ్యులు, వనితలు, భక్తులు పాల్గొన్నారు.
