- భక్తుల వసతి గృహాలు పరిశీలన, సౌకర్యాలలో నిర్లక్ష్యం వద్దు.
- పాతగుట్ట ఆలయాన్ని సందర్శించి సూచనలు చేసిన ఈవో వెంకట్రావు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈనెల 30వ తేదీన నిర్వహింపబడే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించాలని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి పర్యవేక్షణ చేస్తున్నారు ఆలయ ఈవో వెంకట్రావు.ఈ సందర్భంగా మంగళవారం పాతగుట్ట దేవాలయాన్ని సందర్శించి ప్రధానాలయం మాదిరిగానే, పాతగుట్ట ఆలయంలో కూడా అద్భుతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేకంగా లైటింగ్, పుష్పాలంకరణలతో ఆధ్యాత్మిక వాతావరణం కలిగి విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయం మార్గంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు పనులను పరిశీలించారు.షెడ్డు నిర్మాణానికి దాత అయిన జ్ఞానేశ్వర్ ను ప్రశంసించి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం దేవస్థానానికి చెందిన విశ్రాంతి గదులను పరిశీలించి,శానిటేషన్, తప్పనిసరిగా చేయాలని,అలాగే దేవస్థాన గదులలో వాతావరణం దృష్ట్యా గీజర్లను ఏర్పాటు చేయాలని,భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

భక్తుల సౌలభ్యం కోసం బస్టాండ్ వద్ద రూమ్ ఎంక్వయిరీ కౌంటర్ ఏర్పాటు చేసి,నైట్ ఎంక్వయిరీ ఆఫీసర్లను నియమించాలని, అలాగే ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఫిర్యాదు రిజిస్టర్ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.భక్తుల సౌకర్యాల విషయంలో,ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదని,ముఖ్యంగా సేవా వ్యవస్థలో నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ గజవెల్లి రఘు ,నవీన్, శంకర్ నాయక్, జూసెట్టి కృష్ణ, ఈఈ దయాకర్ రెడ్డి, ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు, సిసి వినోద్, తదితరులు పాల్గొన్నారు.
