తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేయాలని సీఎం రేవంత్ (CM Revanth) రెడ్డి ఆదేశించారు. దీనిపై ఆయన బుధవారం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు(Review). అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఈ మేరకు తగిన ప్రణాళిక(Plan)లు సిద్ధం చేయాలని చెప్పారు. అధునాతన పరికరాల (State-of-the-art equipment) ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని సూచించారు.

ఆసుపత్రి నిర్మాణపనులతోపాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పనుల వేగవంతానికి వైద్యారోగ్య, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ(Coordination Committee)ని ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పది రోజులకోసారి సమావేశమై సమస్యలను పరిష్కరిస్తూ పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు ముందుస్తుగానే ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
ఆసుపత్రికి వివిధ రోడ్లను అనుసంధానించే ప్రణాళికలూ రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ (Hyderabad)తోపాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలపై ఒక్కో అధికారి చొప్పున ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. నిర్మాణాలను 24×7 ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. 2026 జూన్ నాటికి నిర్మాణాలను పూర్తిచేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
