కలియుగ దైవమైన తిరుమల శ్రీవారి లడ్డూ అమ్మకాలు పోయినేడాది కనివినీ ఎరగని రీతిలో జరిగాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రసాదాన్ని భక్తులు అత్యంత ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేశారు. ఈ వివరాలను టీటీడీ బోర్డ్ చైర్మన్(TTD Board Chairman) తాజాగా వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) 2025లో 13.52 కోట్ల లడ్డూలను విక్రయించింది. 2024 కన్నా ఇది 10 శాతం ఎక్కువ కావటం గమనార్హం. 2024లో భక్తులు(Devotees) 12.15 కోట్ల లడ్డూలను కొనుగోలు చేశారు. దీంతో పోల్చితే 2025లో 1.37 కోట్ల లడ్డూలు అధికంగా విక్రయమయ్యాయి. ఒక్క రోజు అత్యధిక అమ్మకాలు(Highest Sales) డిసెంబర్ 27న నమోదయ్యాయి. ఆ రోజు ఏకంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.
రోజుకు 4 లక్షలు
టీటీడీ నిత్యం 4 లక్షల వరకు లడ్డూలను తయారుచేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో ఇవి సరిపోతాయి. ముఖ్యమైన రోజుల్లో, భక్తుల రద్దీ ఉన్నప్పుడు లడ్డూల తయారీని పెంచుతారు. అనూహ్యంగా పెరిగే డిమాండ్కి తగ్గట్లు 8 నుంచి 10 లక్షల వరకు లడ్డూలను అదనంగా స్టాక్ ఉంచుతారు. తిరుమల శ్రీవారి లడ్డూకి 310 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన, ఘనమైన చరిత్ర ఉంది. 1715వ సంవత్సరం నుంచి ఆలయ ఆచారాల్లో ఈ ప్రసాదం ఒక భాగమైంది. తొలి రోజుల్లో బూందీ రూపంలో ఇచ్చేవారు.
1940 నుంచి..
ప్రస్తుతం అందిస్తున్న లడ్డూను 1940 నుంచి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుగులేని విధంగా భక్తుల ఆదరణ పొందుతోంది. 2014లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్(Geographical Indication Status) సైతం పొందింది. దీంతో.. టీటీడీ ఒక్కటి మాత్రమే ఈ తరహా ప్రసాదాన్ని తయారుచేసి తిరుమల లడ్డూ పేరుతో విక్రయించగలుగుతోంది. ఈ పవిత్ర ప్రసాదం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం.. దిట్టం అనే సాంప్రదాయ వంటకాన్ని ఖచ్చితంగా పాటించడం. దీన్ని చరిత్రలో 6 సార్లు మాత్రమే సవరించారు.
ప్రతి 5100 లడ్డూలకు ఒకసారి
ప్రతి 5,100 లడ్డూలకు ఒకసారి సాంప్రదాయ రుచిని, నాణ్యతను చెక్ చేస్తారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, బెంగాల్ గ్రామ్ పిండి, చక్కెర, జీడి పప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, రాక్ షుగర్ వంటి పదార్థాలను ఖచ్చితంగా కొలిచిన పరిమాణంలో ఉపయోగిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేస్తామని సీనియర్ అధికారి తెలిపారు. తిరుమల ఆలయం లోపల శ్రీవారి పోటులో దాదాపు 700 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉన్నారు. వారు 2 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేస్తారు. లడ్డూ తయారీ ప్రక్రియలో నిర్దేశిత ఆచారాలు, క్రమశిక్షణ, సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తారు. ప్రసాదం నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
