కర్ణాటకలో జరుగుతున్న సర్వేపై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి దంపతులది అపోహ అని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇది వెనకబడిన వర్గాల సర్వే కాదని, సామాజిక, ఆర్థిక సర్వే అని స్పష్టం చేశారు. తమది వెనకబడిన వర్గాలకు చెందిన కుటుంబం కాదని, ఇందులో పాల్గొనటం వల్ల కమిషన్కు, సర్కారుకు ఉపయోగంలేదని నారాయణమూర్తి దంపతులు అనటంపై సిద్ధరామయ్య స్పందించారు. ఇది రాష్ట్రంలోని ఏడు కోట్ల జనాభాకు సంబంధించిన సర్వే అని చెప్పారు. ఇదే విషయాన్ని ఇప్పటికి పాటికి పది సార్లు చెప్పామని గుర్తుచేశారు. సర్వే దేని గురించి జరుగుతోందో ప్రజలు అర్థం చేసుకోవాలని, నారాయణమూర్తి దంపతులు అర్థంచేసుకోకపోతే తానేం చేయలేనని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేయబోతోందని, దానిపై వాళ్ల (మూర్తి దంపతుల) అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు.
