Sunday, October 26, 2025
ePaper
HomeతెలంగాణDharmapuri | తెలంగాణకు తలమానికం.. ధర్మపురి నాటక సంస్థ..

Dharmapuri | తెలంగాణకు తలమానికం.. ధర్మపురి నాటక సంస్థ..

అక్టోబర్ 25 ప్రపంచ కళాకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం

ధర్మపురి (Dharmapuri) పుణ్యక్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహ నాట్య మండలి (Sri Lakshmi Narasimha Natya Mandali) తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. గత 90 ఏళ్లుగా కళామతల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో 1936లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక, సాంఘిక, చారిత్రక నాటకాలు-నాటికలు ప్రదర్శిస్తోంది. తద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రజల అభిమానాన్ని చూరగొంది. గోదావరి (Godavari) తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది.

తెలంగాణ (Telangana) ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ తెలంగాణలోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని “ఉర్దూ రాజభాష”గా గల నిజాం (Nizam) రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు… భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకు, కళలకు విలువ ఇవ్వని కేంద్ర ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం ఈ సంస్థకు ఊపిరిపోశాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు “సతీ సావిత్రి” నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు… ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ(Lavakusha), భక్త రామదాసు(Bhakta Ramadasu), సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు.

ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి కాదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖర శాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభల్లో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షించగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని చూసి ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది.

స్థానిక దైవం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో(Brahmostavam), ప్రత్యేక ఓపెన్ థియేటర్‌లో ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శనశాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు, మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్ వగైరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్‌లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు.

రెండో తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన సాంప్రదాయ పద్య నాటక పోటీల్లో సూర్యాపేటలో “కట్టబొమ్మన” ప్రదర్శించారు.

2016లో వరంగల్‌లో వేణుమాధవ్ (Venu Madhav) ఆడిటోరియంలో, అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతి(Ravindra Bharati)లో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు పోగేసి సొంత సామగ్రిని సమకూర్చుకున్నారు. ప్రస్తుత నటుల్లో కొందరు వీడియో, చలన చిత్రాల్లో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి, నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్.రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా గుర్తింపు పొందారు. 1993లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి.ఎస్.నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు.

1955లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బతికిస్తున్న అపురూప అరుదైన నాట్య మండలి 2017 ఏప్రిల్ 2, 3 తేదీల్లో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ.రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాజ గోపాల్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు. అయితే ఇటు వృద్ధ కళాకారులకు చేయూత, అటు నాటక ప్రదర్శన లకు తగిన ప్రత్సాహం అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం పై ఉంది.

  • రామకిష్టయ్య సంగనభట్ల
RELATED ARTICLES
- Advertisment -

Latest News