- ప్రభుత్వాన్ని కోరిన తలసాని..
- అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వానికి అప్పీల్..
జనాభా లో 50 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండు బడ్జెట్లు అయిపోయాయని అన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ. 10 వేల కోట్ల వరకు ఉన్నాయని, వెంటనే వాటిని ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కారణంగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు జ్యోతిరావు పూలే ఓవర్సీస్ కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని, ఆ పథకం క్రింద అర్హులైన విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీలో బిల్లు పెడితే చట్టబద్దత రాదని, కేంద్ర ప్రభుత్వం 9 వ షెడ్యూల్ లో చేరిస్తేనే చట్టబద్దత వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరుకాకపోవడం బీసీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. బీసీ సమస్యల పై కాంగ్రెస్ పార్టీలోని బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
